ప్రేమోన్మాదంతో ఓ విద్యార్థి తరగతి గదిలోనే అందరూ చూస్తుండగా తోటి విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తానూ అదే కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటన బుధవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన కౌడ స్నేహ, మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన సాయికిరణ్‌రెడ్డి కామారెడ్డిలోని ఆర్‌కే డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇంటర్ నుంచి ఒకే చోట చదువుతున్న వీరి మధ్య స్నేహం ఉండేది. కానీ, ఇటీవల తనతో కాకుండా ఇతరులతో స్నేహంగా ఉండడాన్ని సాయికిరణ్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో అతడు బుధవారం ఉదయం వెంట తెచ్చుకున్న కత్తితో తరగతి గదిలోనే స్నేహను కత్తితో పొడవగా ఆమె గాయపడింది. మిగతా విద్యార్థులు పట్టుకునేలోగా అదే కత్తితో తన కడుపులో పొడుచుకున్నాడు. కళాశాల అధ్యాపకులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని స్నేహను, సాయికిరణ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. సాయికిరణ్ పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. స్నేహ నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, నిందితునిపై 307, 309, 354, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రూరల్ సీఐ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: