అపరిచితుడు సినిమా చూసే ఉంటారు. అందులో విక్రమ్.. రాముగా, రెమోగా.. అపరిచితుడుగా చక చకా మారిపోతూ.. ప్రేక్షకులను కన్ ఫ్యూజ్ చేసేస్తాడు. ఒక్కడే ఇద్దరు, ముగ్గురులా ప్రవర్తిస్తూ హంగామా చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారా.. పైకి ఒకలా ప్రవర్తిస్తూ... అప్పుడప్పుడు తనలోపలి అపరిచితుడిని బయటకు తీస్తున్నారా.. ఔనంటున్నారు తెలంగాణ తెలుగుదేశం నాయకులు. మాకు ఎవరిపై ద్వేషం లేదు.. ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు నిర్ణయాలు తీసుకోవడం లేదు.. ఆంధ్రా వాళ్లనే టార్గెట్ చేస్తూ సర్వే చేస్తున్నారని భావించడం కేవలం అపోహే.. ఇవీ తరచూ ఇటీవల కేసీఆర్ చెబుతున్న మాటలు.. కానీ ఇవన్నీ పైపైకి చెప్పే కబుర్లేనని.. కేసీఆర్ ఆంధ్రా వ్యతిరేకతను చూపుతున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేవలం ఆరోపించడమే కాదు. అందుకు తగిన సాక్ష్యాధారాలను బయటపెట్టారు. అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు సంబంధించిన టేపును రేవంత్ రెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. ఆంధ్రా కలెక్టర్లను పంపించేస్తానని.. ఆంధ్రా అధికారులను మీటింగులకు రానివ్వనని కేసీఆర్ చెబుతున్నట్టుగా ఆ ఆడియో టేపులు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని చెప్పేందుకు ఇవే సాక్ష్యాలని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ గజినిలా రాష్ట్రాన్ని పాలించాలనుకుంటున్నారని.. ఘాటుగా వ్యాఖ్యానించారు. సర్వే అమలు పై అధికారులు సాధ్యాసాధ్యాలను వివరించే ప్రయత్నం చేసినా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ కు ఎదురు చెప్పే ధైర్యం లేక అధికారులు మిన్నకుంటున్నారని రేవంత్ అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: