మెదక్ లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిగంటల్లో రాజకీయ నాయకుల విమర్శలు తారస్థాయికి చేరాయి.. చివరి రోజుకావడంతో మాటల తూటాలు పేలాయి. ఎలాగైనా గెలుపు తలుపు తట్టాలని పార్టీలు ప్రయత్నాలు ఉధృతం చేశాయి. సభల గోల ముగిసింది. ఇక ప్రలోభాల పర్వం మొదలైంది. చివరిరోజు ప్రచారంలో.. జగ్గారెడ్డి అండ్ టీమ్ మరీ రెచ్చిపోయారు. సంగారెడ్డి సభలో బాలయ్య సమరసింహారెడ్డి సినిమాను మించిన డైలాగులతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు జగ్గారెడ్డి. ఖబడ్డార్ హరీశ్ రావ్.. నీ అంతు చూస్తా.. నీ గుండెల్లో నిద్రపోతా.. అంటూ హైపిచ్ లో డైలాగులు వల్లించాడు జగ్గారెడ్డి. అంతే కాదు.. గత ఎన్నికల్లో తెలిసో.. తెలియకో ఓడించారు.. మళ్లీ ఆ తప్పు చేయకండి అన్నట్టు ప్రజలకు పనిలో పనిగా లైట్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. గెలిపిస్తే.. మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకూ పట్టుకొస్తా అని భారీ హామీ కూడా ఇచ్చేశాడు. ఇక చిన్న చిన్న హామీల సంగతి సరే సరి. గెలిపించకపోతే మాత్రం ముఖం కూడా చూపనంటూ అలక పోజు పెట్టి మరీ ఓట్లడిగాడు. ఇక టీఆర్ఎస్ పై విమర్శలకు ఎప్పుడూ తయారుగా ఉండే టీడీపీ నేత రేవంత్ రెడ్డయితే.. జగ్గారెడ్డిని మించిపోయాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను దొంగ అంటూ వర్ణించారు. ఒక్క అమర వీరుల కుటుంబానికైనా సాయం చేశారా అంటూ నిలదీశారు. అంతే కాదు.. కేసీఆర్ కు కరెక్టు మొగుడు జగ్గారెడ్డేనని తేల్చేశారు. ఇంకో టీడీపీ నేత ఎర్రబెల్లి మరో అడుగు ముందుకేశారు. జగ్గారెడ్డిని గెలిపిస్తే.. కేంద్రమంత్రిని చేసేస్తామని హామీ ఇచ్చేశాడు. అదేదో ఆయన చేతిలోనే ఉన్నట్టు.. ఆయన చెబితే.. మోడీ అరక్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పాస్తాడన్నట్టు.. కబుర్లు చెప్పాడు ఎర్రబెల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: