తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. గత సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గడచిన ఎన్నికల్లో భూమన తిరుపతి అసెంబ్లీ నుంచి ఓటమిపాలయ్యారు. భూమనపై విజయం సాధించిన వెంకటరమణ అకాల మృతి నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది.  ఇతర పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని చెబుతున్న వైసీపీ నేతలు, తాము కూడా బరిలోకి దిగుతామని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్దిసేపటి క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఫోన్ చేశారు. పార్టీ నేతలతో చర్చించి చెబుతామని జగన్, యనమలకు చెప్పినట్లు తెలిసింది. క్షణాల్లోనే దీనిపై నిర్ణయం తీసుకున్న పార్టీ, ఎన్నికల్లో పోటీ చేయరాదని తీర్మానించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: