ఆంధ్రప్రదేశ్ పిసిసి సమన్వయ సమావేశానికి సీనియర్ నేతలు చిరంజీవి, సాయిప్రతాప్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ సమావేశం గురువారం ఇక్కడ ఇందిరాభవన్‌లో జరిగింది. సమావేశం అనంతరం పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే నెల 17, 18 తేదీల్లో విజయవాడలో పార్టీ మేధోమథనం సమావేశం జరుగుతుందన్నారు. ఈ నెల 31వ తేదీన విజయవాడలో పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు సంతకాల ఉద్యమాన్ని చేపడతామన్నారు.  తిరుపతి తెదేపా ఎమ్మెల్యే వెంకటరమణ మృతి నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికలో పోటీచేసే విషయమై కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని దిగ్విజయ్ చెప్పారు. ఈ స్థానానికి అభ్యర్థిని నిలబెట్టరాదంటూ తెదేపా తమను అభ్యర్థించిందని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: