విధినిర్వహణలో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించిన గుజరాత్ దూరదర్శన్ ఉన్నతాధికారి ఒకరు..మూల్యం చెల్లించుకున్నారు. హాయిగా అహ్మదాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్న ఆయన ప్రధానమంత్రి భార్య అయితే ఏమిటి ? ఎవరైతే నాకేంటి ? అని భావించారు కాబోలు. డ్యూటీలో భాగమని భావించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సతీమణి యశోదాబెన్ (వేరుగా ఉంటున్నారు) వార్తను ఈ ఏడాది జనవరి 1న ప్రసారం చేశారు. ఆ తర్వాత అన్ని టీవీ న్యూస్ ఛానళ్ళలో జాతీయ స్థాయిలో ఆ వార్త ప్రసారమై, బాగా రచ్చరచ్చ అయింది.
అంతే , ఒక ఏడాదిలో పదవీ విరమణ చేయనున్న అహ్మదాబాద్ దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ విఎం.వనోల్ (58)కు జనవరి రెండవ వారంలో బదిలీ ఆర్డర్ అందింది. అండమాన్కు బదిలీ అయినట్లు వచ్చిన ఆర్డర్ను చూసి ఆయన మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక తన బతుకు అండమానేనని బోధపడింది. తాను రెండు నిమిషాలపాటు ప్రసారం చేసిన యశోదాబెన్ వార్త ఇంతపని చేసిందా అని అవాక్కయ్యారు దూరదర్శన్ ఉన్న తాధికారి వనోల్. ఇంతకు ఆయన చేసిన తప్పేమిటని ఉత్కంఠతో ఉన్నారా?, ప్రధానమంత్రి భార్యగా తనకు ఉన్న హక్కుల వివరాలేమిటని గుజరాత్ పోలీసులను కోరుతూ మోడీ సతీమణి యశోదాబెన్ సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు.
ఈ వార్తను వనోల్ డిడి గిర్నార్ ద్వారా ప్రసారం చేయడం, ఆ తర్వాత అన్ని ఛానెళ్ళలో హోరెత్తడంషరా మమూలు అయ్యింది. వనోల్ బదిలీపై స్పష్టత ఇవ్వాలని ఈటీ (న్యూస్ ఛానెల్) సమాచార మంత్రిత్వ శాఖను కోరినా ఫలితం లేకపోయింది. బదిలీ ఎడిటోరియల్, పరిపాలనా యంత్రాంగం తీసుకున్న నిర్ణయమని ఉన్నత స్థాయి మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. బదిలీ అనేది, ఏ ప్రత్యేక సంఘటనకో సంబంధించినది కాదని, దీనికి ఏ ఒక్కరో బాధ్యులు కాదని స్పష్టం చేశారు.
అండమాన్లోని పోర్ట్బ్లయిర్ స్టేషన్కు ఉన్నతాధికారులు తనను బదిలీ చేశారని వనోల్ వాపోయారు. జనవరి ఒకటో తేదీన వార్తను ప్రసారం చేసిన అనంతరం న్యూఢిల్లీలోని సమాచార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు అహ్మదాబాద్ దూరదర్శన్ అధికారులతో మాట్లాడి వార్తకు సంబంధించి వివరణ అడిగారు. జాయింట్ డైరెక్టర్, వనోల్ సహా ముగ్గురు సహాయ డైరెక్టర్లు (నలుగురు) ఈ వార్తను ప్రసారం చేయడంలోబాధ్యులని అభియోగం మోపారు. ఇదిలాఉంటే, దైనందిన సమీక్షలో భాగంగా జరిగిందే తప్ప ఏ ఒక ప్రత్యేక సమస్యకో సంబంధిం చినది కాదని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వివరిచంచారు.