జమ్మూ కాశ్మీర్లో పీడీపీ-బీజేపీ కూటమి భవిష్యత్ను నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఒమర్ అబ్దుల్లా సోమవారం ప్రశ్నిం చారు. ఆ కూటమి మనుగడపై సందేహాలు లేవనెత్తారు. రాష్ట్రంలో పీడీపీ-బీజేపీ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్, ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. ''మోడీ-ముఫ్తీ మధ్య కుదిరిన ఒప్పందం పొరపాటని ముఫ్తీ నిర్ణయించారా? కూటమిని విచ్ఛిన్నం చేయాలని తండ్రి-కూతురు ఇద్దరూ బీజేపీపై ఒత్తిడి తెచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారా? ఆశ్చర్యంగా ఉంది.'' అని ఒమర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా సయీద్ ముఫ్తీ ఆది వారం ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు సాఫీగా సాగేందుకు వేర్పాటు వాదులు, తీవ్ర వాదులు సహకరించారని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో పాకిస్తాన్ను ప్రశంసించారు. సయీద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ సోమవారం లోక్సభను బహిష్కరించింది. సయీద్ వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించాలని డిమాండ్ చేసింది. జమ్మూకాశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఆదివారం నుంచి అధికారంలోకి వచ్చింది.
ముఫ్తీ క్షమాపణ చెప్పాలి : జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు సాఫీగా జరగడానికి పాకిస్తాన్, తీవ్రవాదులు, వేర్పాటువాదులు సహకరించా రని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ క్షమాపణ చెప్పాలని నేషనల్ కాన్ఫరెన్స్ సోమవారం డిమాండ్ చేసింది. ఆ వ్యాఖ్యలు చేసి ఆయన రాష్ట్ర ప్రజలను అవమానించారని పేర్కొంది. ఎన్నికల సమయంలో తీవ్రవాదులు స్వల్ప ఘర్షణలకు కారణమయ్యారని, కాశ్మీర్ లోయలో హురియత్ ఎన్నికల వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించిందని నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే మహ్మద్ అక్బర్లోనే పేర్కొన్నారు. ఎన్నికల బహిష్కరణల పిలుపును పెడచెవిన పెట్టిన ప్రజలు పెద్దఎత్తున బయటకు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నార న్నారు.
ఎన్నికలను విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ముఫ్తీ కృతజ్ఞతలు చెప్పాలి. కాని వారిని అవమానించేలా ఎన్నికల ఘనతను తీవ్రవాదులకు, హురియత్కు, పాకిస్తాన్కు ఆపాదించారని లోనే ఇక్కడ విలేకరులతో అన్నారు. ఎన్నికలను ఘర్షణాత్మకం చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా తీవ్రవాదులు వదులుకోలేద న్నారు. హురియత్ ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించిందన్నారు. ఇటువంటి బెదరింపులకు లొంగకుండా వారిని ధైర్యంగా ఎదుర్కొన్న ఘనత ప్రజలదేనన్నారు. దాని ఫలితంగానే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి మహమ్మద్ సయీద్ వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.