డెంగ్యూ దోమ= కేజ్రీవాల్ నల్లధనం దాచుకున్న భారతీయ కుభేరుల జాబితా బయటపెట్టి సంచలనం రేపిన కేజ్రీవాల్ ఇండియన్ అసాంజేగా మారారు. దేశంలోని అవినీతి వ్యవహారాలు బయటపెడుతూ ముందుకెళ్తున్న కేజ్రీవాల్ పై కాంగ్రెస్, బీజీపీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే ఇవేవీ పట్టించుకోని కేజ్రీవాల్... ఇక ముందు కూడా తాను అవినీతీపరుల బండారాలు బయటపెడుతూనే ఉంటానన్నారు. కేజ్రీవాల్ దాడి దోమ కాటు మాత్రమేనని, అది కొద్దిగా మంట పుడుతుంది తప్పితే పెద్ద ప్రమాదమేమీ లేదంటూ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. అవును 'నేను దోమనే. కానీ, మామూలు దోమను కాదు. డెంగీ దోమను! ఇంకా చెప్పాలంటే, దాని కంటే డేంజర్. కాంగ్రెస్, బీజేపీలను కుడితే వాటికి సమస్యలు తప్పవంటూ' చురకలేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఆందజేసిన జాబితాలో తాను చెప్పిన పారిశ్రామిక వేత్తల పేర్లు ఉన్నాయా లేవా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో నల్ల డబ్బు దాచిన పన్ను ఎగవేతదారుల పేర్లను ప్రభుత్వం ఎందుకు తెప్పించలేకపోతోంది? ప్రభుత్వ దర్యాప్తును విశ్వసించడం ఎలా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మొత్తానికి కేజ్రీవాల్ నిజంగానే కాంగ్రెస్, బీజేపీల పాలిట డెంగ్యూ దోమకంటే ప్రమాదకారిగా మారిపోయారు. ఇరుపార్టీ నేతలపై ఆయన చేస్తున్న ఆరోపణలు ఏమేరకు ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయోనని ఆరెండు పార్టీలు భయపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: