ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ఏర్పాటు, విభజన చట్టంలోని సెక్షన్‌ 94 అమలుతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, పట్టిసీమ ప్రాజెక్టు తదితర అంశాలు ప్రధానితో భేటీలో ప్రస్తావనకు వచ్చాయిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలతో కలిసి సోమవారం సాయంత్రం ప్రధానమంత్రిని ఆయన నివాసంలో కలిసిన అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. అర్థం పర్థం లేని ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైనాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును డెడ్‌ స్టోరేజీలోకి నెట్టి, పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తేవడం దారుణమని, దీనికోసం జారీచేసిన జీవోలోని అంశాలన్నీ భయం, విస్మయం గొలిపేలా ఉన్నా యన్నారు. ఆయా చట్టాలతో రాష్ట్రం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధానికి వివరించామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే గోదావరి ట్రిబ్యూనల్‌ ప్రకారం ఏపీకి ఎలాంటి అన్యాయం జరుగుతుందో వివరించినట్లు తెలిపారు.

మోడీతో జగన్

వైఎస్‌ జగన్‌ ప్రస్తావించినవాటిలో కొన్ని ముఖ్యాంశాలు..

గోదావరి ట్రిబ్యూనల్‌లోని 7 ఎఫ్‌ క్లాజ్‌ ప్రకారం ఎంత నీటిని ఏపీ వాడుకుంటుందో అంతే నీటిని కర్ణాటక, మహారాష్ట్రలూ తీసుకుంటాయి. జీవో జారీ అయింది కాబట్టి నిర్మాణంతో నిమిత్తం లేకుండా ఆ రెండు రాష్ట్రాలు ఇప్పటి నుంచే నీటిని వాడుకుంటాయిని భయపడుతున్నాం.ఎగువ రాష్ట్రాలు నీటిని తీసుకుంటారేమోనన్న భయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.పోలవరం ప్రాజెక్టుకు 130 టీఎంసీల స్టోరేజీ నిర్మాణం ఉంది. కానీ పట్టిసీమ ప్రాజెక్టుతో ఒక్క టీఎంసీ నీటిని కూడా స్టోర్‌ చేసుకోలేం. భారీ ఎక్సెస్‌తో టెండర్లను రూపొందించారు. అనుయాయులకు లబ్ధి చేకూరేలా సీఎం వ్యవహరిస్తున్నారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరించొద్దనే నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి. దీనిపై శాంతకుమార్‌ రూపొందించిన నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని మనవి. ఈ నిర్ణయంతో మద్దతు ధర లభించక రైతులు విలవిలలాడే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: