అమెరికాలో జరుగుతున్న తానా, నాట్స్ సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ప్రముఖులు తరలి వెళ్లారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహా పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులతో పాటు మీడియా పెద్దలూ వెళ్లారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేగా ప్రసిద్ధుడైన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
అంతేకాదు.. అక్కడ ప్రవాసాంధ్రులతో రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై మాట్లాడుతూ కేసీఆర్, గవర్నర్, జగన్ లపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ గతంలో తనకు మంచి మిత్రుడన్న రాధాకృష్ణ.. ఇప్పుడు కేసీఆరే తనతో స్నేహం వద్దని అనుకుంటున్నారని కామెంట్ చేశారు.
కేసీఆర్ వద్దనుకున్నారు.. జగన్ రావడం లేదు..
ఏబీఎన్పై నిషేధం అంశంపైనా రాధాకృష్ణ స్పందించారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ ద్వారా పోరాడుతున్నాం.. ప్రస్తుతం ఆ విషయం సుప్రీం కోర్టులో ఉంది. కోర్టుదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. అంతే తప్ప.. తాను కేసీఆర్ వద్దకు వెళ్లి రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నానని తనపై ఇప్పటికే తెలంగాణ ద్రోహి అనే ముద్ర వేశారని వాపోయారు.
జగన్తో ఓపెన్ హార్ట్ ఎప్పుడు చేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. చాలా కాలంనుంచి పిలుస్తున్నా జగన్ తనతో మాట్లాడేందుకు రావడం లేదని చెప్పారు. ఒకవేళ మీరు పిలిపిస్తే రేపే ప్రోగ్రామ్ చేస్తానని నవ్వుతూ చెప్పారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి గవర్నర్ ను కూడా పిలిచానని ఆయన కూడా రావడం లేదని రాధాకృష్ణ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత కేవలం రాజకీయనాయకులు, మీడియాది మాత్రమే కాదని.. జనం చైతన్యవంతులవ్వాలని ఆర్కే చెప్పారు.