ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కు ముగింపు పలికింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇన్నాళ్లుగా పెట్టుకున్న ఆశలు ఒక్కసారి నీరుగారాయి. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో ప్రత్యేక హోదా ప్రకటనను వినబోతున్నామని గత కొద్ది రోజుల క్రితం విజయవాడలో పార్టీ ఆధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలు చేశారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ తో సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు లేవు. ప్రత్యేక సాయం తప్పా, హోదా అనేది లేదని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్ సభ సాక్షిగా తేల్చిచెప్పారు. నిన్న లోక్ సభ లో ప్రశ్నోత్తరాల సమయంలోనే ఇంద్రజిత్ సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బీహర్ తో పాటు ఎవరికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆయన చెప్పారు. బీహార్ కు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించింది ప్రత్యేక ప్యాకేజీనే అని స్పష్టం చేశారు.
విభజన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరి కష్టాలు వారివి అనే పరిస్థితుల్లో ఏర్పడ్డాయి. కాకపోతే.. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇస్తాం అనే మాట రాయించుకున్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం కూడా విభజన బిల్లు ఈ విషయాన్ని పొందుపరిచింది. ప్రతి పక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఈ విషయం పై నాడు పెద్ద రాద్దాంతమే చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం స్పెషల్ స్టేటస్ విషయంలో మాటలవరకే పరిమితమైనట్టు తెలుస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా ను సాధించుకోవడంలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో ఆయన పార్టీ ఎంపీలందరూ సమావేశమైన తరువాత కేంద్రమంత్రి సుజనా చౌదరి చాలా ఘనంగా ఒక మాట చెప్పారు. ఒకటిన్నర నెలరోజుల్లో ఏపీ కి స్పెషల్ స్టేటస్ వస్తుందని సెలవిచ్చారు. అమాయక ఏపీ ప్రజలు నిజమే అని నమ్మారు.
వెంకయ్యనాయుడు విభజన వల్ల తీవ్రంగా నష్టపోయయిoది ఏపీ
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ విభజన వల్ల నష్టపోతున్న ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించగా…అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు విభజన వల్ల తీవ్రంగా నష్టపోయే ఏపీకి ఐదేళ్ళ ప్రత్యేక హోదా ఏ మాత్రం సరిపోదని..పదేళ్లు ఇవ్వాల్సిందేని పట్టుబట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక వెంకయ్యనాయుడు కీలక భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం అసలు ప్రత్యేక హోదా సాధ్యమే కాదని తేల్చిచెప్పింది. దీనిపై మరోసారి రాజకీయ రగడ మొదలైంది. ప్రతిపక్షాలు అధికార టీడీపీ, కేంద్రంలోని బిజెపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. గత విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉంటూ ప్రత్యేక హోదా పై పట్టుబట్టిన వెంకయ్యనాయుడు అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక హోదా మేం తీసుకువస్తాం అని ఎన్నడూ చెప్పలేదు. అంతకంటె మించిన ప్యాకేజీలు ఇస్తాం అనే నయగారపు మాటలు మాత్రమే వల్లించారు.
ఈ సందర్భంలో స్పెషల్ స్టేటస్ సాధించలేని తెలుగుదేశం ఎంపీలకు సిగ్గులేదా అని పవన్కల్యాణ్ అన్నమాటలను కూడా గుర్తు చేసుకోవాలి. చంద్రబాబునాయుడు కేంద్రంలో తమ పార్టీ భాగస్వాములు అని డబ్బా కొట్టుకుంటారు. అక్కడ తాము ఏదైనా సాధించగలం అన్నట్లుగా చెబుతుంటారు. కానీ ప్రత్యేకహోదా విషయంలో ఏమాత్రం సానుకూలత సాధించలేకపోవడం ఆయనకు సిగ్గుచేటు అని ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు వంటి మాయలమరాఠీ సింగపూర్ మాస్టర్ ప్లాన్ వంటివి అరచేతిలో స్వర్గంలాగా చూపించి.. మాయచేయవచ్చు గాక.. కానీ.. ఇలాంటి చేతగానితనపు దృష్టాంతాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచు కుంటారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తామని అప్పట్లో టీడీపీ, బీజేపీలు ప్రచార సమయంలో ఏపీ కి ప్రత్యేక హోదాను తెచ్చి తీరాతామని ప్రచార సమయంలో హోరెత్తించాయి. కానీ ఇప్పుడు మాట మార్చారు.
సిటీ నటుడు శివాజీ ఏపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దీంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలకు రాబోయే రోజుల్లో ఇది ఓ పెద్ద అస్త్రంగా మారబోతోంది. దీనికి తోడు గత ఎన్నికల సమయంలో మద్దతు ఇచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై గళం విన్పించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ప్రత్యేక హోదా కోసం అంటూ పోరాడుతున్న సిటీ నటుడు శివాజీ ఏపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీలు సిగ్గులేని దద్దమ్మలని సినీ హీరో శివాజీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఊరుకునేది లేదని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. మోడీ గుజరాత్ తెలివితేటలు ఆంధ్రలో చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి ఆంధ్ర ప్రజల ఉసురు తప్పక తగులుతుందని శపించారు. జగన్ తన కేసులకు భయపడి కేంద్రాన్ని నిందించడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఓటుకునోటులో దొరికిపోవడం మూలంగా కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారని శివాజీ వ్యాఖ్యానించారు.
ఇక ఏపీ కి ప్రత్యేక హోదా లేదని పార్లమెంట్ సాక్షిగా తేలిపోయింది. అధికారిక ప్రకటన తప్పా, హోదా పై అశలు సన్నగిల్లాయి. ఇక ఏపీ ఎంపీ లకు ఈ వ్యవహారం కీలకంగా మారబోతుంది. ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్న టీడీపీ, వైకాపా ఎంపీలు ఏపీ ప్రజలకు ఏం సమాధానం చెప్పునుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నుందో చూడాలి మరి.