ఐపీఎల్ వేలంపాటలో తనకు రూ.2.6 కోట్ల ధర పలుకుతుందని వూహించలేదని హైదరాబాద్ రంజీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఐపీఎల్లో సత్తాచాటి టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని తెలిపాడు. నాన్న మమ్మల్ని పెంచడం కోసం 30 ఏళ్లుగా ఆటో నడుపుతున్నారు... ముందు ఆయనతో ఆటో మాన్పిస్తాను...ఆయన బాధ్యతలన్నీ భుజాన వేసుకుంటాను...కుటుంబాన్ని నేనే నడిపిస్తానన్నాడు.
సోమవారం జరిగిన ఐపీఎల్ వేలంపాటలో సిరాజ్ను సన్రైజర్స్ హైదరాబాద్ కొనుక్కుంది. భారీ మొత్తం రావడంతో బంజారహిల్స్ ఖాజానగర్లోని సిరాజ్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ఐపీఎల్ వేలంలో ఎంపికవుతానని ఊహించాను కానీ, ఇంత మొత్తానికి నన్ను కొనుగోలు చేస్తారని ఊహించలేదన్నాడు. వేలంపాటలో వచ్చిన డబ్బుతో ఇల్లు కొంటా. ఇంతకుముందు భారత్—ఎకు ఆడటమే లక్ష్యంగా నిర్దేశించుకున్నా. ఇప్పుడు ఐపీఎల్లో అవకాశం వచ్చింది. ఐపీఎల్లో సత్తాచాటి టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం.
డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, భువనేశ్వర్ కుమార్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లతో కలసి ఆడడం అదృష్టమని చెప్పాడు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ కి బౌలింగ్ చేయడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదని భావిస్తున్నానని సిరాజ్ పేర్కొన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన్మయ్ అగర్వాల్ కూడా చోటు సంపాదించాడు. అతణ్ని కనీస ధర రూ.10 లక్షలకు సన్రైజర్స్ సొంతం చేసుకుంది.