తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చాపకింద నీరులా కేసులు విస్తరిస్తున్నాయి. రెడ్ జోన్స్, కంటైన్మెంట్ జోన్స్ ని ప్రకటించి అప్రమత్తం చేస్తున్నా.. కేసులు మాత్రం ఆగడంలేదు. తాజాగా నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 28 బయటపడటం ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో ఆదివారం ఒక్క రోజే కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 531కు చేరిం ది. కాగా చనిపోయినవారి సంఖ్య 16కి చేరింది. ఆదివారం ఏడుగురు వ్యక్తులు దవాఖానల నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 103 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 412 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఇంకా కఠిన చర్యలు తీసుకోవలసి ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మర్కజ్కు వెళ్ళివచ్చినవారు రాష్ట్రంలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు జరిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం కావాలని లేకుంటే కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ వృథా అవు తాయన్నారు.