కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 14తో ముగియనున్న లాక్ డౌన్ ను 30 వరకు పొడిగిం చిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని కూడా నిషేధించారు. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కరోనా బాధితులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి శుభవార్తను అందించారు. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది షిఫ్టులవారీగా విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.
ఐదు రోజులపాటు విధులు నిర్వహించేలా అవకాశం కల్పించారు. ఆ తర్వాత ప్రత్యేక కేంద్రాల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఇంటికెళ్లినా.. ఐదు రోజులపాటు వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే. ఇక ఇంటికి వెళ్లే వారికి ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పించనుంది. కాగా ముఖ్యమంత్రి నిర్ణయంపై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.