కరోనా మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చి క్లినికల్ ట్రయల్స్ సైతం నిర్వహిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో టీకాను కనుగొనేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. అయితే ఇంత వరకు కరోనా వైరస్కు సంబంధించిన జన్యుక్రమాన్ని ఎవరూ పూర్తిస్థాయిలో విశ్లేషించలేకపోయారు.
ఇక చైనీస్ శాస్త్రవేత్తలు మాత్రం గబ్బిలాల్లోని ఆర్ఎమ్వైఎన్ఓ2 జన్యుక్రమం, హెచ్సీఓవీ-19(కోవిడ్-19) జన్యుక్రమంతో దాదాపు 93 శాతం సరిపోలిందని గతంలో వెల్లడించారు. జన్యు పునఃసంయోగాల (జీన్ రీకాంబినేషన్) వల్లే కరోనా పుట్టిందని అంచనా వేశారు. తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్ఆర్) చేసిన అధ్యయనంలోనూ ఇదే తరహా కీలక విషయాలు వెల్లడయ్యాయి.
రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా రెండు భిన్న రకాల గబ్బిలాలపై పరిశోధనలు జరిపినట్లు ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. దీని ఆధారంగా రౌసెట్టస్, టెరోపస్ రకాకలు చెందిన గబ్బిలాల్లో కరోనా వైరస్ బయటపడినట్లు వెల్లడించింది. ఇక టెరోపస్ రకంలో గతంలో నిపా వైరస్ ఆశ్రయం పొందినట్లుగా రుజువైందని పేర్కొంది. ఈ క్రమంలో కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిళ్లలో దాదాపు అన్నీ కరోనా పాజిటివ్గా తేలినట్లు తెలిపింది.