దేశంలో కోవిడ్-19 విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనా నేపథ్యంలో చాలా మంది వైద్యులు వైద్య సేవలు అందించేందుకు వెనుకంజ వేస్తున్నారు. అయితే ఇద్దరు వైద్య దంపతులు మాత్రం వైద్య వృత్తిని దైవంగా పాటిస్తూ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 20 రోజుల్లో 229 కాన్పులు చేసి ఆదర్శంగా నిలిచారు. డాక్టర్ రామనగౌడ, డాక్టర్ వృందాలు దంపతులు. వీరు యాదగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. డాక్టర్ రామనగౌడ కోవిడ్ నియంత్రణ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ వృందా ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ.
అయినా గ్రామీణ మహిళలకు ప్రసవం, సిజేరియన్ ఆపరేషన్లు చేయడంలో దంపతులు నిమగ్నమయ్యారు. గత నెల 26 నుంచి ఇప్పటి వరకు 229 మంది గర్భిణిలకు ప్రసవం చేశారు. పదవీ విరమణ చేసిన వైద్యులు నరసమ్మ, ఆస్పత్రి ఉద్యోగులు డాక్టర్ ప్రీతి, వీణా, నాగశ్రీ, సిబ్బంది సరోజ, సలోమి, అనితా, సరస్వతి, రూబినా, సావిత్రి, దీనా, పద్మ, సువర్ణ, సుజాత, మోనమ్మల సహకారంతో వైద్య దంపతులు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.