కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. అయితే పోలీసులు ఎంత చెబుతున్నప్పటికీ పలువురు ఆంక్షలు ఉల్లంఘించి, రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వారిపట్ల పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. ఈక్రమంలోనే పోలీసులకు, ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్నాటకలో వెలుగుచూసింది. పీకాలదాక తాగిన యువతులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
లాక్డౌన్ సందర్భంగా బెంగళూరులో పోలీసులు అక్కడక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నలుగురు యువతులు మద్యం సేవించి కారులో ప్రయాణిస్తూ లీలా ప్యాలెస్ సమీపంలో చెక్పోస్టు వద్దకు చేరుకున్నారు. పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేస్తుండగా తమ వద్ద పాస్ ఉందని, మాకు ఉన్నతాధికారులు తెలుసంటూ యువతులు వాదనకు దిగారు. మద్యం తాగినట్లు అనుమానం రావడంతో బ్రీతింగ్ అనలైజర్తో తనిఖీ చేయడానికి యత్నించగా యువతులు పోలీసులపైకి వాహనాన్ని దూకించే యత్నం చేసి ఉడాయించారు. పోలీసులు బైక్పై కిలోమీటర్ దూరం వరకు వెంటాడినా ప్రయోజనం లేకపోయింది. కారు నంబర్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.