కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మే 3 తో ముగియనుంది. ఓ వైపు లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతున్నా.. పాజిటివ్ కేసులు మా త్రం తగ్గడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలను మరికొన్ని రోజులపాటు పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నాయి. ప్రధాని ప్రకటన కంటే ముందే తెలంగాణలో సీఎం కేసీఆర్ లాక్డౌన్ను మే 7 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత కూడా పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొన్ని రోజులపాటు ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈక్రమంలోనే తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్ కొనసాగింపునకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ సర్కార్లు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చాయి. లాక్డౌన్ పొడిగింపు వ్యూహాన్నే అమలు చేయాలని యోచిస్తున్నాయి. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగల్ ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మే 16 వరకు లాక్ డౌన్ ను పొడిగించేందుకు ఆయా రాష్ట్రాలు సిద్దమైనట్లు సమాచారం.