దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రంగాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈమేరకు ఇండి యన్ బ్యాంక్స్ అసోసియేషన్ నగదు విత్ డ్రాలకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఖాతాదారులు ఎక్కువశాతం ఎలక్ట్రానిక్ విధానం ద్వారా తమ తమ లావాదేవీల నిర్వహణ పెంచుకునేలా చేయాలని ఆలోచిస్తోంది. దీని ద్వారా బ్యాంకులను సందర్శించే అవసరం తగ్గుతుంది.
ఇందులో భాగంగా ఖాతాదారులు తమ అకౌంట్ నంబర్ల చివరిలో ఉండే 0,1 వంటి సంఖ్యల ఆధారంగా నిర్ణయించిన తేదీల్లోనే తమ నగదు లా వాదేవీలు అంటే నగదు ఉపసంహరణ చేసుకునేందుకు బ్యాంకుకు రావాల్సి ఉంటుంది. అది కూడా సామాజిక దూరం, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తేనే బ్యాంకులోకి వచ్చే వీలుంటుంది. మే 4వ తేదీన బ్యాంకు అకౌంట్ నంబరు చివరి సంఖ్య 0 &1 ఉన్నవారు బ్యాంకుకు వచ్చి తన ఖాతాలోని నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.
మే 5వ తేదీన బ్యాంకు అకౌంట్ నంబరులో చివరి సంఖ్య 2&3 ఉన్నవారు, మే 6వ తేదీన 4&5 సంఖ్యలు ఉన్నవారు, మే 8వ తేదీన 6&7 సంఖ్యలు ఉన్నవారు, మే 11వ తేదీన బ్యాంకు అకౌంట్ నంబరు చివరన 8&9 సంఖ్యలు ఉన్నవారు బ్యాంకుల వద్దకు రావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మే 11వరకూ ఇదే విధానం అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత మాత్రం ఎప్పటిలాగే డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ విధానం ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవడం ఉపయోగకరమని బ్యాంకింగ్ అసోసియేషన్ వెల్లడించింది.