దేశంలో మొదటిసారిగా కంటైన్మెంట్ పదాన్ని తానే పరిచయం చేశానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో ఎవరికీ కూడా ఈ పదం లేలియదని, కేంద్రానికి కూడా దీని గురించి తెలియదన్నారు. అలాంటి సమయంలో కరీంనగర్ను తాము మొదటిసారిగా కంటైన్మెంట్ జోన్గా ప్ర కటించామని కేసీఆర్ అన్నారు.
మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గం సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. మొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో కేసులు నమోదు అయినప్పుడు ఈ కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి, కరోనా వైరస్ను కట్టడి చేశామని కేసీఆర్ చెప్పారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి మొదట నుంచీ అప్రమత్తంగా, కఠినంగా వ్యవహరించామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ రోజు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని అన్నారు. అయినా మరింత అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే మనం ఈ మహమ్మారి నుంచి బయటపడుతామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.