దేశంలో అత్యధిక కరోనా రికవరీ రేట్ తెలంగాణలోనే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా రికవరీ రేట్ 27.3 శాతం ఉంటే.. తెలంగాణ లో 57.3శాతం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో మరణాల రేట్ కూడా తక్కువగా ఉందని ఆయన అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధా నికి కృషి చేస్తున్న వారందరకీ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. కరోనా పట్ల మొదటి నుంచీ అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని తెలంగాణలో కట్టడి చేయగలిగామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గం సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అందరి కృషి, అనేక చర్యల ఫలితంగా తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని, మరికొన్ని రోజుల్లో అప్రమత్తంగా ఉంటే.. ఇక మనం వైరస్ బారి నుంచి బయటపడినట్టేనని కేసీఆర్ పేర్కొన్నారు.
లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడం వల్లే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన వివరించారు. అయినా మనం మరింత అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే మనం ఈ మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో బయటపడుతామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.