దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు లాక్డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు కుదుటపడుతోన్న వేళ కరోనా విజృంభణ మాత్రం ఆగడం లేదు. ఇక మన దేశంలో మహారాష్ట్ర కరోనా విషయంలో పెద్ద డేంజర్ స్టేట్ గా మారింది. అక్కడ శరవేగంగా పెరుగుతోన్న కేసులు యావత్ దేశాన్నే భయపెడుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో ఏకంగా 3,007 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల సంఖ్య 85,975కు చేరుకుంది. అలాగే, ఇప్పటి వరకు 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా కేసుల లెక్కలు చూస్తే కేసుల సంఖ్య 2.5 లక్షలు దాటేసింది. అంటే దేశం మొత్తం మీద నమోదు అవుతోన్న కేసుల్లో 1 / 3వంతు కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే మనదేశంలో ఓ రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రం అసలు కరోనా పుట్టిన చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటి వరకు 83,036 కేసులు నమోదు కాగా, అత్యధిక కేసులు కలిగిన దేశాల జాబితాలో చైనా 18వ స్థానంలో ఉంది. భారత్ ఆరో స్థానంలో ఉంది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో కొత్తగా 1,515 కేసులు నమోదు కాగా, 18 మంది మృతి చెందారు.
అక్కడ ఇప్పటి వరకు 31,667 కేసులు నమోదయ్యాయి. 269 మంది మరణించారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 27,654 కేసులు నమోదు కాగా, 761 మంది మరణించారు. గుజరాత్లో 19,592 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1219 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఉత్తరప్రదేశ్ కొత్తగా 433 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,536కు పెరిగింది.