భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతల వేళ.. అమెరికా రక్షణ మంత్రి మార్క్​ ఎస్పర్​తో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ఫోన్​లో సంభాషించారు. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇండో-పసిఫిక్​ ప్రాంతీయ భద్రతా అంశాలపైనా రాజ్​నాథ్​, ఎస్పర్​ చర్చించారని వెల్లడించారు రక్షణ శాఖ అధికారులు. చైనా అంశంతో పాటు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అమెరికా అభ్యర్థన మేరకే ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య ఫోన్​ సంభాషణ జరిగినట్లు వెల్లడించారు. సరిహద్దులో చైనా దూకుడుగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో భారత అవలంబిస్తున్న వైఖరిని ఎస్పర్​కు రాజ్​నాథ్​ వివరించినట్లు చెప్పారు రక్షణ శాఖ అధికారులు.

 

 

సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తి 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. గత ఎనిమిది వారాలుగా తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.అయితే.. భారత సైన్యంతో ఒప్పందంలో భాగంగా గత ఐదు రోజులుగా చైనా సైన్యం తన బలగాలను వెనక్కి తరలిస్తోంది.సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇప్పటికే ఇరు దేశాలు పలు మార్లు దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరిపాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: