నిజాంబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకి మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్లో కాకుండా ఆటోలో తరలించడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. మామూలుగా అయితే కరోనా వైరస్ ద్వారా మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి ఎంతో జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది, ఏ చిన్న పొరపాటు వచ్చిన ఇతరులకు కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉంటుంది.
కానీ నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో కరోనా రోగి మృతదేహాన్ని తరలించారు. ఆటోలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉండగా ఇద్దరు కూడా ఎక్కడ పీపీఈ కిట్లు ధరించడం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ చెయ్యలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే ఒకేరోజు కరోనా తో ముగ్గురు చనిపోయారని అందుకే ఆంబులెన్స్ అందుబాటులో లేదు అంటూ సమాధానం చెబుతున్నారు వైద్య సిబ్బంది.