సర్వీసు సంగతి ఏమో కానీ... మొబైల్ కంపెనీలు ఛార్జీలు పెంచటంలో మాత్రం ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. ఒకే రోజులో కొన్ని గంటల వ్యవధిలోనే మూడు కంపెనీలు వినియోగదారులపై పెద్ద భారం మోపాయి. జియో...వొడాఫోన్...ఐడియా ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వినియోగాదారలకు మరింత భారం కానుంది.
మొబైల్ కంపెనీలు వినియోగదారులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి ఛార్జీలు పెంచుతూ జనం జేబులు గుల్ల చేస్తున్నాయి. ముకేశ్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కూడా వినియోగదారులకు షాకిచ్చింది. వాయిస్, డేటా ఛార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లు తీసుకొస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో నూతన ప్లాన్ల కింద 300 శాతం అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లలో ఇతర నెట్వర్క్కు చేసే కాల్స్కు గానూ ఎఫ్యూపీ లిమిట్ విధించనున్నట్లు వెల్లడించింది.
అన్లిమిటెడ్ వాయిస్, డేటాతో కొత్త ఆల్ఇన్ వన్ ప్లాన్లను జియో ప్రవేశపెట్టబోతోంది. ఇతర నెట్వర్క్కు చేసే కాల్స్పై ఫెయిర్ యూసేజ్ పాలసీని ఈ ప్లాన్లు కలిగి ఉంటాయి. 2019 డిసెంబర్ 6 నుంచి కొత్త ప్లాన్లు అమల్లోకి రానున్నాయి'' అని కంపెనీ తెలిపింది. సవరించిన టెలికాం ఛార్జీల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని వివరించింది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ డిసెంబర్ 3 నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే జియో కూడా పెంపు నిర్ణయం తీసుకోవడం విశేషం.
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్...ఐడియా డిసెంబర్ 3 నుంచి ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈ ఛార్జీల పెంపుదల 42 శాతం వరకు ఉండనుంది. దీనికి తోడు వొడాఫోన్ ఐడియా నుంచి ఇతర నెట్వర్క్కు చేసే కాల్స్పై కూడా నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఓ మొబైల్ కంపెనీ టారిఫ్ ధరలను పెంచడం విశేషం. వొడాఫోన్...ఐడియా లిమిటెడ్ ప్రీపెయిడ్ కొత్త టారిఫ్లు, ప్లాన్లు ప్రకటిస్తోంది. అన్నీ ప్లాన్లు దేశవ్యాప్తంగా డిసెంబర్ మూడో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.