అప్పుడెప్పుడో 1994లో ఒక్క రూపాయి నోటు ముద్రణను ఆపేసింది మన రిజర్వు బ్యాంకు. ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో.., 2015లో మళ్లీ రూపాయి నోటు ముద్రించారు. అవి అంతగా చెలామణిలో లేకపోయినా ఇప్పుడు తాజాగా మళ్లీ కొత్త నోట్లు రాబోతున్నాయి. అవును! మీరు విన్నది నిజమే. అతి త్వరలో కొత్త రూపాయి నోటు చలామణిలోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో రంగు, డిజైన్, ప్రామాణిక బరువు, కొలతలు మొదలైన వాటి గురించి వివరాలను తెలిపింది.
ఫిబ్రవరి 1న విడుదలైన ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ-గెజిట్ ప్రకారం.. కొత్త 1 రూపాయి నోట్ల ప్రచురణ ఫిబ్రవరి 7, 2020 నుంచి జరుగుతుంది. ఆర్బీఐ ముద్రించే నోట్లపై మనం ఆర్బీఐ గవర్నర్ సంతకాన్ని గమనించొచ్చు. కానీ ఆర్థిక శాఖ ముద్రించే రూపాయి నోటుపై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఉంటుంది. అలాగే రూపాయి కరెన్సీ నోట్ దీర్ఘచతురస్రాకార 9.7 x 6.3 సెం.మీ ఉంటుంది. దాని కాగితం 100 శాతం రాగ్ కంటెంట్తో తయారు చేయబడింది. ఈ నోట్ 110 మైక్రాన్ల మందం ఉంటుంది. దీని బరువు 90 జిఎస్ఎం ఉంటుంది.
నోటు అధిక భాగం గులాబీ ఆకుపచ్చ రంగులో ముద్రించి ఉంటుంది. 2020లో విడుదలైన ఒక రూపాయి నాణెంపై ఉన్న రూపీ సంజ్ఞ, సత్యమేవ జయతే, నంబరింగ్ ప్యానెల్లో క్యాపిటల్ ఎల్ ఉంటుంది. అలాగే నోటు కుడి వైపు కింది భాగాన ఆరోహరణ క్రమంలో ఎడమ నుంచి కుడివైప్ నంబర్లు ఉంటాయి. మొదటి మూడు అల్ఫాన్యూమరిక్ అక్షరాలు ఒకే సైజులో ఉంటాయి. నోటు మరోవైపున భారత్ సర్కార్ అని ముద్రించి ఉంటుంది. ఈ పదాలపై ఈ ఏడాది 2020 అని ముద్రించి ఉంటుంది. రూపాయి నాణెం ముద్రణ ఉంటుంది. మరియు 15 భాషల్లో 'ఒక రూపాయి' అని రాసి ఉంటుంది.