భారతదేశంలోనే కాదు.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్.. ముకేశ్ అంబానీపైనా కరోనా ఎఫెక్ట్ పడింది. ఏకంగా కరోనా వైరస్ రిలయన్స్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తనకు తానుగా తన జీతంలో కోత విధించుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల వేతనాల్లో కోతకు ఇప్పటికే సన్నాహాలు ఆరంభించింది. అయితే ముందుగా ముకేశ్ అంబానీయే తన జీతంలో కోత విధించుకుంటూ ఉద్యోగులకు సందేశం పంపడం గమనార్హం. ముఖేష్ అంబానీతో పాటు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర సీనియర్ లీడర్లు సహా కంపెనీ బోర్డు డైరెక్టర్లు అందరికీ జీతాల్లో కోత ఉంటుందని తెలుస్తోంది.
కంపెనీలో ఉన్నతస్థానంలో ఉన్నవారందరికీ కూడా జీతంలో 30 నుంచి 60శాతం వరకు కూడా కోతలు ఉంటాయని సమాచారం. ఇదిలా ఉండగా ముకేశ్ అంబానీ అయితే మొత్తం వేతనాన్ని వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్లోనే హైడ్రోకార్బన్ బిజినెస్లోని ఉద్యోగుల్లో రూ.15 లక్షలకు పైగా వేతనం అందుకుంటున్న వారికి స్థిర వేతనంలో 10 శాతం కోత ఉంటుంది. అదే రూ.15 లక్షలలోపు వేతనం ఉంటే ఎలాంటి కోత ఉండదు. కరోనా ప్రభావం ముఖ్యంగా హైడ్రోకార్బన్ బిజినెస్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిటల్ ఆర్ మేశ్వనీ తెలిపారు.
రిఫైన్డ్ ప్రొడక్ట్స్, పెట్రో కెమికల్స్కు డిమాండ్ పడిపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చుల తగ్గింపుపై ఇప్పుడు తాము దృష్టి పెట్టామని చెప్పారు. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధపడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మా చైర్మన్ ముఖేష్ అంబానీ తన వేతనాన్ని వదులుకోవడానికి అంగీకరించారని పేర్కొన్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలనే ఫేస్బుక్తో కూడా జతకట్టిన విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.43 వేల కోట్లకు పైగానే ఉంటుందని ప్రకటించారు. ఇంకా వాట్సాప్ కూడా జియోమార్ట్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం విదితమే.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple