రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రిజర్వేషన్ చేసుకుని వచ్చినవారినే అనుమతిస్తుండటం సాధారణ ప్రయానికులు, నిరాక్షరాస్యులు రైలు ప్రయాణానికి దూరంగా ఉంటున్నారు. రిజర్వేషన్పై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం ప్రధాన కారణమైంతే, కరోనా వైరస్ భయాలు కూడా తోడవుతున్నాయి. రైల్వే చార్ట్ ప్రకారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గురువారం గోదావరి ఎక్స్ప్రెస్కు 1516 మంది రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే 1276 మంది మాత్రమే ఎక్కినట్లు రైల్వే అధికారుల పరిశీలనలో తేలింది. ఫలక్నుమాలో వెళ్లాల్సిన ప్రయాణికుల సంఖ్య 1493 ఉండగా 1400 మంది ప్రయాణించారు.
అంటే దాదాపు 93మంది ప్రయాణానికి దూరంగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్లో 620 మంది సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కాల్సి ఉండగా కేవలం 421మంది మాత్రమే ప్రయాణించినట్లుగా రైల్వే అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో జనం జంకుతున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఉండాలన్నా…అలాంటి పరిస్థితిల్లో జర్నీ చేయాలన్నా ప్రజలు వెనుకాడుతున్నారు. రైళ్లలో ప్రయాణం చేస్తే ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందోనన్న భయంతో రైలు ప్రయాణానికి దూరంగా ఉంటున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు.
సరైన జాగ్రత్తలు పాటిస్తే పరిపోతుందని చెబుతున్నా...వారిలో భయాలు పోవడం లేదని పేర్కొంటున్నారు. దీంతో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే రిజర్వేషన్ చేసుకుని ఆ తర్వాత ప్రయాణాలకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య ఏకంగా వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. కరోనా భయంకరమైనది కాదని, ముందు జాగ్రత్త చర్యగా రైల్ కోచ్లను శుభ్రం చేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. సర్వీసులు ముగిసిన తర్వాత ఆటో కెమికల్స్తో క్లీన్ చేస్తున్నామన్నారు. ప్రయాణీకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
అదే సమయంలో విమాన ప్రయానాలకు జనాలు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక బస్సు ప్రయాణాలు క్రమంగా పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కోలుకుంటున్నాయి.