షియామీ సంస్థ తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలు ప్రకటించిన సంగతి తెలిసిందే... వీటిని ఆన్లైన్లో విక్రయించడానికి మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు ముహుర్తం పెట్టింది. తక్కువ ధరలకే స్మార్ట్ టీవీలను ప్రకటించడంతో... వినియోగదారులు పెద్దఎత్తున ఎదురుచూశారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర కేవలం రూ.13, 999గా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.22 999గాను, 55 అంగుళాల టీవీని రూ .39,999గాను నిర్ణయించింది.
పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. కచ్చితంగా 12 గంటలకు స్టాక్ రిలీజ్ అని చెప్పింది. అధికారిక వెబ్సైట్తోపాటు.... ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్టు ఇందుకు వేదికలయ్యాయి. అయితే సేల్ ప్రారంభించిన నిమిషాల్లోనే వినియోగదారులను ఉసూరుమనిపించింది. ఒక విధంగా కళ్లు మూసి తెరిచేలోపు అవుట్ ఆఫ్ స్టాక్...నోటి ఫై మి అని దర్శనమివ్వడంపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తీరా 12 గంటలకే ఓపెన్ చేయగానే 'అవుట్ ఆఫ్ స్టాక్' అనే టైటిల్ దర్శనమివ్వడంతో అవాక్కయ్యారు. ఒక్క నిమిషంలో ఇలా జరగడమేంటని...? వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. మళ్లీ మార్చి 16న మధ్యాహ్నం 12 గంటలకు బుకింగ్ ఉంటుందని సంస్థ ప్రకటించింది.