ఆక‌ర్ష‌ణీయ‌మైన కెరీర్‌కు చిరునామాగా నిలిచే విమాన‌యాన రంగం ఇప్పుడు ఆందోళ‌న‌కు నిద‌ర్శ‌నంగా మారుతోంది.ఇప్ప‌టికే ఆర్థిక‌ సుడిగుండంలో కొట్టుకొని ఇప్పటికే అర్ధంతరంగా మూతపడిన కింగ్‌ఫిషర్, జెట్ ఎయిర్‌వేస్ బాటలోనే మరో సంస్థ నడుస్తోందనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రభుత్వరంగ హెలిక్యాప్టర్ల నిర్వహణ సంస్థ పవన్ హన్స్ కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో ఏప్రిల్ నెలకుగాను వేతనాలను చెల్లించలేకపోతున్నామని ఇటీవల ఉద్యోగులకు పంపిన సర్క్యూలర్‌లో పేర్కొంది. 


తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విమానయాన రంగానికి.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని పవన్ హన్స్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.89 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కంపెనీకి వచ్చే ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటున్నదని, ముఖ్యంగా ఉద్యోగుల కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో సంస్థ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం పడుతున్నదని ఆ వర్గాలు వెల్లడించాయి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశామని, ఈ ఆపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఉద్యోగులు కలిసికట్టుగా కృషి చేయాలని యాజమాన్యం సూచించింది. పవన్ హన్స్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు అమానుషం అని వ్యాఖ్యానించాయి. జీతభత్యాలను పెంచుతారని అనుకుంటే.. ఉన్న వాటిని చెల్లించలేమని చెప్పడం ఆందోళన కలిగిస్తున్నదని వారు పేర్కొన్నారు.
 అయితే సంస్థకు కస్టమర్ల నుంచి రావాల్సిన రూ.230 కోట్ల బకాయిల్లో 60 శాతం వరకు వసూలైనప్పటికీ ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం 46 హెలిక్యాప్టర్లతో పవన్ హన్స్ సేవలు అందిస్తోంది. ఆర్థిక కష్టాల సుడిగుండంలో చిక్కిన ఈ విమానయాన సంస్థ భ‌విష్య‌త్ మ‌రెంద‌రి జీవితాల‌ను రోడ్డున ప‌డేస్తుంద‌నే భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: