ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతకర కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు అతలా కుతలం అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 40 లక్షల మార్క్ దాటేయగా.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరువ అవుతోంది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. అయితే ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందు పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ లాక్డౌన్ కారణంగా నిత్యవసర వస్తువులు మినహా.. మిగిలిన అన్ని సంస్థలు మూతపడ్డాయి. ఇందుకు విద్యాసంస్థలు కూడా మినహాయింపు కాదు.
దీంతో స్కూల్ కాలేజీలతో పాటు, అన్నిరకాల కోచింగ్ సెంటర్లు మూసివేయడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో విద్యార్థులకు రానున్న విద్యాసంవత్సరానికి కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. లాక్డౌన్తో విద్యాసంస్థలు మూతపడడంతో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తుంటే..కొన్ని చోట్ల అవి సమస్యాత్మకంగా మారుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లో 12వ తరగతి విద్యార్థులకు వాట్సప్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి దిమ్మతిరిగే సంఘటన ఎదురైంది. ఆన్లైన్లో క్లాసులు చెబుతున్న సమయంలో వాట్సప్ గ్రూప్లో అసభ్య సందేశాలతో పాటు అశ్లీల వీడియో క్లిప్పింగ్ను పోస్ట్ చేశారు ఇద్దరు విద్యార్థులు. దీంతో కంగుతున్న ఉపాధ్యాయుడు గ్రూప్ నుంచి బయటకు వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం చాలా చోట్ల వెలుగు చూస్తున్నాయి. నేటి యువశక్తే రేపటి దేశానికి వెన్నుముక లాంటిదని కలలు కంటున్నారు. కానీ, కొందరు తప్పుడు మార్గంలో పయనిస్తూ.. బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు.