నేటి సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. సినిమాల ప్రభావమో.. లేదా ప్రభుత్వ విఫలమో.. తెలియదు కానీ, ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి. గంటకో లైంగిక దాడి ..రోజుకో అత్యాచారం ఇలా పలు దారుణాలు మహిళలపై జరుగుతున్నాయి. నిర్భయ చట్టం, గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. మరోవైపు పోలీసులు ఉన్నారు. కానీ, ఆడవారిపై దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇక తాజాగా మరదలిపై మోజు పడిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య దారుణంగా హతమార్చాడు.
పూర్తి వివరాల్లో వెళ్తే.. బేతంచెర్ల మండలం గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలబాయికి రెండేళ్ల క్రితం అలేబాదు తండాకు చెందిన రవినాయక్తో వివాహమైంది. ఈ దంపతులకు ఏడాది వయసున్న కుమార్తె కూడా ఉంది. అయితే సుశీలబాయి చెల్లిపై మోజు పడిన రవినాయక్.. ఆమెను వివాహం చేసుకుంటానంటూ చెప్పేవారు. ఈ విషయంపై సుశీలబాయి మరియు రవినాయక్ మధ్య ఎప్పటికప్పుడు తీవ్ర వాగ్వాదం నడిచేది. దీంతో మరదలిని పెళ్లి చేసుకునేందుకు భార్యను అంతమొందించాలని పథకం వేశాడు రవినాయక్. ఈ క్రమంలోనే ఆదివారం తనతో పాటు పశువులను మేపేందుకు కొండకు తీసుకెళ్లాడు. ఇక ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. అక్కడ రవినాయక్ సుశీలబాయిను రాళ్లతో కొట్టి చంపేసి మృతదేహాన్ని లోయలోకి తోశాడు.
అనంతరం ఏమీ ఎరుగనట్లు ఇంటికి వచ్చి తన భార్య కనబడడంలేదని గ్రామస్తులతో మెరపెట్టుకున్నారు. మరోవైపు భార్య తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు రవినయాక్. విషయం తెలుసుకుని ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు.. రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకొని కుమార్తె కోసం గాలించారు. కానీ, కుమార్తె జాడ కనిపించలేదు. అయితే చివరకు సుశీల బాయి మృతదేహం గ్రామ శివార్లలోని లోయలో పడి ఉండడాన్ని గమనించిన పశువుల కాపరులు.. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. దీంతో రవినాయక్ పరారయ్యాడు. అప్పుడు సుశీలబాయిని భర్తే చంపాడని అర్థం చేసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.