ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నాయకులతో, అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయం తెలుసుకుంటూ ఇతర రాష్ట్రాలకు భిన్నంగా అందరు చెప్పుకోదగ్గ రీతిలో పాలనను నడిపించాలని జగన్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టడంపై దృష్టిసారించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. పోలీస్ వ్యవస్థలో కింది స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు బదిలీలకు శ్రీకారం చుడుతున్నట్టుగా సమాచారం.
మరోవైపు, ప్రభుత్వ అధికారుల స్వేచ్ఛను ఎవరు హరించరాదని జగన్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ఫలాలు సరైన రీతిలో అందుతున్నాయా లేదా అనే విషయాలపై కూడా దూర దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. తన పార్టీ గెలుపుకు ప్రధాన కారణమైన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు తన పాలనకు కూడా ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్టు వినిపిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పీకే టీమ్ విధులు నిర్వహిస్తుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులపై, చోటమోట లీడర్లపై నిఘా నిర్వహించి వారు చేసే ఘనకార్యాలు జగన్ కు చేరవేస్తారట. జగన్ తన పాలనలో ఎక్కడా అవినీతి వినిపించకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారట.
తాజాగా జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియా సమావేశంలోనూ ఇదే విషయం చెప్పుకొచ్చారు జగన్. రాష్ట్రంలో అవినీతి అన్నది ఎక్కడా లేకుండా.. పారదర్శక పాలన అందిస్తామన్నారు. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేసి.. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్లు రద్దు చేస్తామన్నారు. అవసరమైన చర్యలు వెంటనే తీసుకుంటామన్నారు.
అదేవిధంగా జగన్ పాలనా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశాలపై పీకే టీమ్ ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ జగన్కు అందిస్తూ ఉంటుందట. తన పాలనా గడిచే ఆరునెలల కాలం నుంచి సంవత్సరంలోపే రాష్ట్ర పాలనలో పెనుమార్పులు సృష్టించబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా తక్కువ ఖర్చుతో ఎలాంటి మార్పులు చేయాలనే అంశాలపై జగన్ దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తరహాలో పేరు తెచ్చుకుంటూ పాలనలో మాత్రం తనదైన మార్క్ను చూపించాలని జగన్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ తన పాలనలో తీసుకోబోయే సంచలన నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి.