ప్రస్తుతం కరోనా వైరస్.. కంటికి కనిపించకుండా లక్షలాది ప్రాణాలను బలితీసుకుంటోంది. దీంతో కరోనా పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి అనతి కాలంలోనే దేశదేశాలు విస్తరించి.. ప్రజలను ముప్పతిప్పలు పెడుతోంది. కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఇదే సమయంలో ఎందరో ఉద్యోగాలు కోల్పోయి.. రోడ్డున పడుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఏపీలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్ అందింది.
ఆంధ్రప్రదేశ్ డైరక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో 665 ఖాళీలను ప్రకటించింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎంబీబీఎస్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ అధికారిక వెబ్సైట్ http://cfw.ap.nic.in/ లో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
అలాగే ఆంధ్రప్రదేశ్ వైధ్య విధాన పరిషత్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసన్, అనస్థీషియా లాంటి విభాగాల్లో మొత్తం 723 ఖాళీలను ప్రకటించింది. వారి వివరాలు చూస్తే.. గైనకాలజీ- 333, పీడియాట్రిక్స్- 38, అనస్థీషియా- 105, జనరల్ మెడిసిన్- 37, జనరల్ సర్జరీ- 29, ఆర్థోపెడిక్స్- 31, ప్యాథాలజీ- 24, ఆప్తమాలజీ- 27, రేడియాలజీ- 27, సైకియాట్రి- 7, డెర్మటాలజీ- 11, ఈఎన్టీ- 23, డెంటల్ అసిస్టెంట్ సర్జన్- 31 ఖాళీలు ఉన్నాయి. పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్బీ, బీడీఎస్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ http://cfw.ap.nic.in/ లో తెలుసుకోవచ్చు.
కాగా, ఈ రెండు నోటిఫికేషన్లలో మొత్తం కలిపి 1388 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 18 చివరి తేదీ. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవలెను.