సాధారణంగా మనిషి మాట్లాడడానికి స్వరపేటిక ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ గొంతు క్యాన్సర్ వల్ల దాన్ని తొలగిస్తే ఇక ఆ బాధితులు తిరిగి మాట్లాడలేరు. ఇక మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ వాయిస్ బాక్స్ ఎంతలేదన్నా దాదాపు ముప్పై వేల వరకు ఉంటుంది. అయినా, దాన్ని ప్రతీ ఆరు నెలలకోసారి మార్చుకుంటూ ఉండాలి. అయితే అలాంటి వారిందరికి నేనున్నానని ముందుకు వచ్చాడు ఓ డాక్టర్. వైద్యం వ్యాపారంలా మారిన ఈ రోజుల్లో కూడా ఈ నానుడిని అక్షరాలా నిజమని నిరూపించారు బెంగళూరుకు చెందిన అంకాలజిస్ట్ డాక్టర్ విశాల్ రావు.
ఆయన కనుగొన్న పరికరం ఎంతో మంది గొంతు కేన్సర్ రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. డాక్టర్ విశాల్రావు బెంగళూరులోని హెల్త్కేర్ గ్లోబల్ క్యాన్సర్ సెంటర్ అనే హాస్పిటల్లో హెడ్, నెక్ సర్జన్గా పనిచేస్తున్నాడు. ఈయన గొంతు క్యాన్సర్ ద్వారా స్వరపేటిక తొలగించబడిన బాధితుల కోసం ఓం వాయిస్ ప్రోస్థసిస్ అనబడే ఓ పరికరాన్ని తయారు చేశారు. ఈ డివైస్ను 2015లో ఆయన రూపొందించారు. ఇక అప్పటి నుంచి ఎందరో గొంతు క్యాన్సర్ బాధితులకు ఈ పరికరాన్ని అమర్చి, పోయిన వారి గొంతును తిరిగి తెప్పిస్తున్నారు.
ఇక దీని ధర విషయానికి వస్తే.. కేవలం 50 రూపాయలు. విశాల్ కనిపెట్టిన ఈ ఓం వాయిస్ ప్రోస్థసిస్ పేషెంట్ల పాలిట వరంగా మారింది. అయితే ఈ పరికరాలను తయారు చేసేందుకు కావల్సిన డబ్బు తన వద్ద లేకపోవడంతో మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అయితే ఎట్టకేలకు ఆయన పలు ఎన్జీవోల సహాయంతో ఆ పరికరాలను తయారు చేసి బాధితులకు అందివ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పరికరం ధర రూ.3వేలు. అయినప్పటికీ మార్కెట్లో లభించే ఇలాంటి కృత్రిమ పరికరాలతో పోలిస్తే ఓం వాయిస్ ప్రోస్థసిస్ ధర 85 శాతం తక్కువ కావడం నిజంగా విశేషం అని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసిన వాళ్లు విశాల్ రావును తెగ ప్రశంసిస్తున్నారు.