ఈ మధ్య కాలంలో గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. పుల్లటి తేన్పులు, గొంతులో మంట, ఛాతీలో నొప్పి, కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపించడం... ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ వల్ల కలిగే సమస్యలు. చాలామంది గ్యాస్ ట్రబుల్ ను చిన్న సమస్యగా భావిస్తారు. కానీ కొన్నిసార్లు ఈ సమస్య వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
తొలి దశలోనే గ్యాస్ ట్రబుల్ ను గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య లేదు కానీ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం జీర్ణకోశవ్యాధులు, అల్సర్లు, ఇతర సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సూచనలు పాటించి గ్యాస్ ట్రబుల్ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ సమస్యతో బాధపడేవారు పరిశుభ్రమైన మంచి నీరు ఎక్కువగా తాగాలి. పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడంతో పాటు వీలైనంత సమయం వ్యాయామం చేయాలి.
టీ, కాఫీలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సరైన ఆహార నియమాలను పాటించాలి. గోరువెచ్చని నీటితో పాటు బంగాళదుంప జ్యూస్ తీసుకుంటే సమస్య దూరమవుతుంది. రోజూ పైనాపిల్, బొప్పాయి పండ్లను తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. భోజనం ముగిసిన వెంటనే సోంపు తీసుకున్నా... అల్లం టీ లేదా అల్లం ముక్కను ప్రతిరోజు తీసుకున్నా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.