దోసకాయలు.. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దోసకాయలతో ముఖ్యంగా భారతీయులు ఎన్నో అద్భుతమైన వంటలు చేస్తుంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అధికంగా పండించే పంటలలో దోసకాయ నాలువ స్థానంలో ఉందంటే.. వీటి ప్రముఖ్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. అయితే వేసవికాలంలో తింటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అందుకే వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కార్బోనేటేడ్ ద్రావణాల కన్నా, దోసకాయ తినటం మంచిది.
అంతేకాదు, దోసకాయల్లో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారమని నిపుణులు అంటున్నారు. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. ఇక వయసు మీదపడే కొద్దీ కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. అయితే దోసకాయలో లభించే సిలికా కంటెంట్ అనేది చర్మ సంరక్షణకు ఉపయోగపడటంతో పాటు కండరాల టిష్యూల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
అలాగే దోసకాయలో యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలు ఉన్నందున కంటి వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం 15 నిమిషాల పాటు కళ్ళపై దోసకాయ ముక్కలను ఉంచటం వల్ల మంటలు తగ్గి ఉపశయనంతో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది. కళ్ళ వాపు తగ్గుతుంది కూడా. ఇక దోసకాయలో ఉండే నీటి శాతం, శరీర వ్యవస్థలలో ఉండే విష, హానికర పదార్థాలను బయటకు పంపివేస్తాయి. శరీరాన్ని చల్లబరచి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులు, దోసకాయ రసాన్ని తాగటం వలన మంచి ఫలితాలను పొందొచ్చని నిపుణులు అంటున్నారు. అందుకే వారానికి కసీనం రెండు సార్లు అయినా దోసకాయలను తింటి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.