భారత్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వంద నుంచి రోజుకు చనిపోయే వారి సంఖ్య 300 వరకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా ఇలా మరణాలు చోటు చేసుకుంటున్న వాటిల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉండగా ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈనెల మధ్య నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతాయని వైద్య నిపుణులు అంచనా వేసినప్పిటికి విరుద్ధంగా పెరగడం మొదలవుతున్నాయి. అయితే సామూహిక వ్యాప్తి జరగడం లేదు. ఒకే ప్రాంతం పరిధిలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం గమనించాల్సి ఉంది.
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గత మూడురోజులుగా దేశంలో నిత్యం 11వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్లో కొవిడ్-19 మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. కరోనా సోకిన వారిలో నిత్యం 300లకు పైగా బాధితులు మృత్యువాతపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 325మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారిసంఖ్య 9520కి చేరింది.
దేశంలో కరోనావైరస్ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకోగా మరో 1,53,106 మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రస్తుతం దేశంలో క్రియాశీలకంగా ఉన్న బాధితుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రపంచంలో రోజువారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారత్లోనే ఎక్కువగా నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. కొవిడ్ మరణాల్లో మాత్రం ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.