తెలుగు మీడియా సంస్థల్లో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు కరోనా కాటుకు గురవుతున్న విషయం తెలిసిందే. మొత్తం 1400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధపడగా ఇప్పటి వరకు దాదాపు 300 మందికి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఆదివారం ఒక్కరోజే 23మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడం గమనార్హం. దీంతో అటు మీడియా సంస్థలు కూడా అప్రమత్తయ్యాయి. పలు చిన్న పత్రికలైతే వర్క్ ఫ్రం హోంకు వీలు కల్పించడం విశేషం. అత్యవసరమైతే తప్పా ఉద్యోగులను ఆఫీసులకు రానివ్వద్దని యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక డెస్క్ల్లోనూ సామాజిక దూరం పాటించేలా సిట్టింగ్ విధానంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ప్రముఖ దినపత్రికలో ఇప్పటి కే వారంలో మూడు రోజులు మాత్రమే పని చేసేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మిగతా ప్రధాన పత్రికలు కూడా అదే విధానంలో అవలంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో ఇప్పటికే సిబ్బందిని కుదేంచిసిన యాజమాన్యాలు తాజాగా హైదరాబాద్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తక్కువ సిబ్బందితోనే పని చేయించుకునేలా మార్పులు చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్న వేళ ప్రెస్ అకాడమీ నుంచి సాయం అందించేలా చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ లో కొత్తగా 25 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా రూ.20 వేల రూపాయల చొప్పున అందజేశారు.
అలాగే హోంక్వారైంటైన్ లో ఉన్న వారిజర్నలిస్టుకు పది వేల చొప్పున, మొత్తం 5 లక్షల పది వేల ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. ఆయా పాత్రికేయుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేశారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటీవ్ లు వచ్చిన 56 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున 11 లక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న 14 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున ఒక లక్ష 40 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల అరవై వేల రూపాయలను అకాడమీ నిధుల నుండి అందించామని తెలిపారు.