మానవాళిపై పగబట్టిన కరోనా శరవేగంగా విస్తృతి సాధిస్తోంది. కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కరాళ నృత్యం చేస్తున్నది. బుధవారం నాటికి కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటేయడం గమనార్హం. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 39 వేల కొత్తకేసులు నమోదవడం అక్కడి పరిస్థితి అద్దం పడుతోంది. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో అమెరికా తొలిస్థానంలో కొనసాగుతుండగా రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. తాజాగా 41వేల పైచిలుకు కేసులు నమోదవడంతో ఆదేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,92,474కు చేరింది. ఆ దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల 53,874 మంది మరణించగా, 4,88,692 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
భారతదేశంలో 4,72,985కు మొత్తం కరోనా కేసుల సంఖ్య చేరుకుంది. మూడో స్థానంలో రష్యా కొనసాగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో ఈ వైరస్ వల్ల 5వేలకు పైగా బాధితులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,84,960కు పెరిగడం గమనార్హం. ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 51,75,319 మంది కోలుకోగా, మరో 38,07,790 మంది వివిధ దశల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 24,62,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 1,24,281 మంది బాధితులు మృతిచెందారు. కరోనా సోకినవారిలో 10,40,605 మంది కోలుకున్నారు. మరో 12,97,668 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 6,06,881 పాజిటివ్ కేసులతో రష్యా మూడోస్థానంలో కొనసాగుతున్నది.
భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,72,985కు చేరింది. దేశంలో 2,71,688 మంది బాధితులు కోలుకోగా, 1,86,390 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడినవారిలో 14,907 మంది మరణించారు. ఇదిలా ఉండగా కరోనా ఇప్పటి నుంచి మరింత వేగంగా విస్తరిస్తుందన్న ప్రమాదకర సంకేతాలను డబ్ల్యూహెచ్వో తెలియజేస్తోంది. ఆయా దేశాల్లో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అంతేకాక ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలకు ఏర్పాట్లు చేసుకోవాలని, తగినంత భౌతికదూరం పాటించాలని, కరోనా పరీక్షల నిర్వహణను వేగిరం చేసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రతి దేశం శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నది. దాదాపుగా 100కు పైగా వ్యాక్సిన్లు తయారీ చేసేందుకు ఆయా దేశాలు కృషి చేస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఐదు దశలు దాటుకొని విజయవంతంగా వ్యాక్సిన్ తయారు కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని తెలుస్తోంది.