అనుకున్నంతా జరిగింది. కేరళను వణికించేస్తున్న నిపా వైరస్ తెలుగు రాష్ట్రాలకు సోకినట్లు అనుమానంగా ఉంది. ఇటీవలే కేరళకు వెళ్ళిన ఇద్దరు హైదరాబాద్ వాసులకు నిపా వైరస్ సోకినట్లు అనుమానంగా ఉంది. కేరళ నుండి తిరిగి వచ్చిన వారి ఆరోగ్య పరిస్ధితిలో మార్పలు గమనించిన కుటుంబసభ్యులు వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లు సమాచారం. దాంతో అప్రమత్తమైన ఆసుపత్రి వైద్యులు వెంటనే వారిద్దరిని వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్సలు మొదలుపెట్టారు. మొదట ఓ రోగి ఓ కార్పొరేట్ ఆసుపత్రికే వెళ్ళగా రోగి లక్షణాలను గమనించి చికిత్స చేయటానికి నిరాకరించారు. దాంతో చేసేది లేక వెంటనే ఫీవర్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ వైద్యులు వెంటనే రక్త నమూనాలు తీసుకుని వారు పరీక్షించటమే కాకుండా తదుపరి పూణేకు కూడా పంపారు.
ఇద్దరు యువకులకు నిపా
ఇదిలావుండగా మరో యువకుడు కూడా ఇదే విధంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళాడు. పరీక్షించిన వైద్యులు వెంటనే లక్షణాలు గుర్తించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స మొదలుపెట్టారు. ఇతర రక్త నమూనాలు కూడా సేకరించారు. కేరళలో ఇదే వైరస్ తో ఇప్పటికి సుమారు 12 మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. నివారణ లేని నిపా వైరస్ కు ముందుజాగ్రత్త పడటమే మార్గం. పండ్లను కొరికిన గబ్బిలాల వల్ల, గుడ్ల గూబలు, పందుల వల్లే నిపా వైరస్ సోకుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. కేరళను వణికిస్తున్న నిపా వైరస్ తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ సోకుతుందో అన్న ఆందోళన పడుతుండగానే హైదరాబాద్ లోని ఇద్దరు యువకులకు వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తుండటంతో ప్రభుత్వాధికారుల్లో ఆందోళన ఎక్కువైపోయింది.