బంగారంపై స్పష్టత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి పరిమితులు విధించలేదని తేల్చి చెప్పింది. ఐటీ పరిధి దాటితే కొన్ని షరతులు ఉంటాయని హెచ్చరించింది. ఐతే వారసత్వంగా వచ్చిన బంగారాన్ని సీజ్‌ చేయబోమని చెప్పింది. 


కొన్ని రోజులుగా బంగారంపై జరుగుతున్న ప్రచారం, వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టింది కేంద్రం. బంగారం పరిమితిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చింది. కీలక నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఎలాంటి పరిమితులు విధించలేదని ఇన్‌కమ్‌ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ చెప్పింది. టాక్స్‌ పరిధిలో ఎంత బంగారం అయిన నిల్వ ఉంచుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. వారసత్వంగా వచ్చిన బంగారాన్ని సీజ్‌ చేయబోమని స్పష్టం చేసింది. బడ్జెట్‌ తయారీ సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది. 


బ్లాక్‌మనీ బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. క్షమాభిక్ష పథకాన్ని త్వరలోనే తీసుకురాబోతుందని వార్తలు వచ్చాయి. పరిమితికిమించి బంగారం ఉంటే స్వచ్ఛందంగా వెల్లడించి పన్ను చెల్లించాల్సి ఉంటుందనే ప్రచారం జరిగింది. దీంతో అందరిలో ఆందోళన నెలకొంది. అసలే బడ్జెట్‌ తయారీ సీజన్‌. అందులోనూ నోట్లు రద్దు చేసింది నవంబర్‌లోనే. దీంతో మోడీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంటుందని అంతా భావించారు. ఏదో జరగబోతుందన్న టెన్షన్‌ మొదలైంది. దీంతో క్లారిటీ ఇచ్చింది కేంద్రం. బంగారం పరిమితిపై ఎలాంటి ఆలోచనేమీ లేదని స్పష్టం చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: