కళ్లముందే కన్నతండ్రిని, తోబుట్టువును చంపేస్తున్నా ఏమీ చేయలేని దయనీయ స్థితి ఆ యువతిది. ఉగ్రవాదుల అకృత్యానికి బలై.. నెలల తరబడి బానిసగా నరకం అనుభవించిన నిస్సహాయురాలు. కన్నీళ్లకు, కష్టాలకు తలవంచలేదు. ఎన్నో కలలతో జీవితాన్ని గడుపాలనుకున్న నదియా జీవితంలో చిమ్మచీకటి అలుముకుంది. జీవితంలో ఎన్నో చీకటి కోణాలు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురై, తల్లిని, తోబుట్టువులను కోల్పోయింది. నిస్సహాయ స్థితిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ది. లైంగిక వేధింపులకు గురై ప్రాణాలు ఉంటాయో ఉండవో తెలియని స్థితి నుంచి శాంతి స్థాపనకు నడుం బిగించి ఇప్పుడు ప్రపంచం దృష్టినే మార్చేసింది. నోబుల్ శాంతి బహుమతి సైతం అమెనే వెతుక్కుంటు వచ్చింది.
లైంగిక బాధితురాలిగా ఎన్నోసార్లు ఉగ్రవాదుల చేతిలో సామూహిక అత్యాచారాలకు గురై, తల్లిని, తోబుట్టువులను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న యువతి.. ఇప్పుడు అత్యున్నత నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. ఆమె ఇరాక్లోని యాజిదీ తెగకు చెందిన నదియా మురద్. తనలా నరకం అనుభవిస్తున్న యాజిదీ యువతులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న మురద్ అందుకోసం ఎంతో కృషి చేస్తోంది. యుద్ధంలో మహిళలపై లైంగిక హింసను ఆయుధంగా వాడుకోవడాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషికి గాను కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ ముక్వెగె, ఇరాక్కు చెందిన నదియా మురద్లకు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం లభించింది. 25ఏళ్ల నదియా మురద్ యాజిదీ అమ్మాయిగా ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు.
నదియా ఇరాక్లో యాజిదీలు ఎక్కువగా నివసించే సింజర్ ప్రాంతలో ఉండేది. ఇది సిరియా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వారి చేసే అకృత్యాలు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా యాజిదీ స్త్రీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తారు. 2014 ఆగస్టులో నదియా జీవితంలో నరకం మొదలైంది. ఐఎస్ ఉగ్రవాదులు నల్లని జెండాలతో ట్రక్కుల్లో వచ్చారు. నదియా గ్రామమైన కోచోలో చొరబడి ఇష్టం వచ్చినట్లుగా పురుషులను చంపేశారు. చిన్న పిల్లలను బందించి ఉగ్రవాదులుగా శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్లిపోయారు. వేలాది మంది యాజిదీ స్త్రీలు, అమ్మాయిలను పనివాళ్లుగా, లైంగిక బానిసలుగా మార్చేశారు.
అప్పుడే నదియాను కూడా ఉగ్రవాదులు అపహరించారు. కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై ఉగ్రవాదులు సామూహికంగా అత్యాచారాలకు పాల్పడ్డారు. విపరీతంగా కొట్టి హింసించారు. ఉగ్రవాదులు యాజిదీ మహిళలను, బాలికలను మార్కెట్లో అమ్మేసేవారు. వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి పెళ్లిళ్లు చేసుకునేవారు. సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయిల చేత బలవంతంగా మేకప్ వేయించి, బిగుతైన బట్టలు వేయించి జిహాదీలు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. అలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉగ్రవాదుల చెరలో ఉన్న నదియా ఓ ముస్లిం కుటుంబం సాయంతో మోసుల్ నగరం నుంచి తప్పించుకుని బయటపడింది. నకిలీ పత్రాలతో వేల కిలోమీటర్లు ప్రయాణించి యాజిదీ వాళ్లు ఉండే సహాయక శిబిరాలకు చేరుకుంది. అప్పటికే తన తల్లి, ఆరుగురు సోదరులు చనిపోయారని తెలుసుకుంది. దుఃఖాన్ని దిగమింగుకుని జర్మనీలో తన సోదరి ఉంటుందని తెలుసుకుని ఓ సంస్థ సహాయంతో అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె జర్మనీలోనే ఉంటోంది.
అప్పటి నుంచి నదియా తన జీవితాన్ని.. నరక కూపంలో మగ్గుతున్న యాజిదీ మహిళలను కాపాడడానికే అంకితం చేసింది. కనిపించకుండా పోయిన దాదాపు 3వేల మంది యాజిదీల ఆచూకీ కోసం ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. తనపై జరిగిన అకృత్యాల గురించి, యాజిదీ మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి నదియా 2015లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ఐక్యరాజ్యసమితి నదియాను గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. నదియా జీవితాన్ని తెలియజేస్తూ 2017లో ‘ది లాస్ట్ గర్ల్’ అనే పుస్తకం విడుదలైంది.
లైంగిక హింసను అరికట్టేందుకు ఆమె చేస్తున్న కృషికి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆమె జీవితం సినిమాను మించిన సినిమా. ఆమె పోరాటం యూత్కు గొప్ప స్ఫూర్తి.