తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం వేలాది భక్తులు వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అయితే, ఏపీలో వై.ఎస్.జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొండపై భక్తులకు అతి తక్కువ ధరలకే భోజన సదుపాయం కల్పించేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో ఇటీవల కొండపై ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్కు రూ.60 వసూలు చేస్తున్నారు. ఈ పద్దతిని మార్చి, ఇక నుంచి కొండపై ప్లేట్ ఇడ్లీ రూ.7.50, భోజనం రూ.22.50గా విక్రయించాలని దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఫుల్ మీల్స్కు రూ.31 మాత్రమే తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైనా సరే నిర్ణయించిన ధరలకు మించి, ఎక్కువ ధరలను భక్తుల దగ్గర వసూలు చేస్తే..టోల్ ఫ్రీ నంబర్ 18004254141కి ఫోన్ చేయాలని ఏపీ ఎండోమెంట్స్ విభాగం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఈ ధరల మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ,తిరుమలకు చేరుకోవడంలో ఇబ్బందులు కలిగినా, ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి మాట్లాడ వచ్చు. 1800 4254141, 1800 425333333 కాల్ సెంటర్ 8772277777, 8772233333