ఇడియట్ సినిమాతో మంచి మాస్ హిట్ అందుకున్న రవితేజ వరుస విజయాలతో స్టార్ హీరోగా మారారు. మాస్ మహరాజగా అభిమానులు పిలుచుకునే రవితేజ ‘పవర్’ సినిమా తర్వాత రెండు భారీ డిజాస్టర్స్ చవిచూడాడు. దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న రవితేజ కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ ఈ సంవత్సరం ‘రాజా ది గ్రేట్ ’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఫుల్ లెన్త్ అంధుడిగా నటించిన రవితేజ నటనకు అందరూ ఫిదా అయ్యారు.
ఈ సినిమా విజయం తర్వాత టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..కానీ అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేక పోయాడు. రవితేజ త్వరలో 'నేల టిక్కెట్టు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గత మూడు సంవత్సరాల నుంచి ఫెల్యూర్స్ తో సతమతమవుతున్న దర్శకులు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. గతంలో దుబాయ్ శ్రీను లాంటి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీను వైట్ల మరోసారి మాస్ ఎలిమెంట్స్ తో 'అమర్ అక్బర్ ఆంటోని' తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా కొంతవరకు చిత్రీకరణ జరుపుకుంది. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. జూలై నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘తెరి’ సినిమా ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ కథను సిద్ధం చేసుకున్నాడు.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో రవితేజ, కాజల్ జంటగా 'వీర','సారొచ్చారు' సినిమాలు వచ్చాయి..కానీ అవి పెద్దగా హిట్ కాలేదు. దాంతో మొదట కాజల్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోక పోయినా..తర్వాత దర్శకుడు ఆమెను ఒప్పించారనేది తాజా సమాచారం. ఈ సారి ఈ జంట హిట్ కొడుతుందేమో చూడాలి.