ఈజీగా డబ్బు సంపాదించే క్రమంలో కొంత మంది చేస్తున్న అక్రమాలు ఇతరులపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా దొంగ నోట్లు వ్యవహారంలో అన్యాయంగా అమాయకులు బలి అవుతున్నారు. దొరికితే దొంగలు..లేదంటే దొరలు అన్న చందంగా వ్యవస్థ తయారు అవుతుంది. తాజాగా దొంగ నోట్లు ముద్రించిన కేసులో మలయాళం టీవీ సీరియల్ నటి సూర్య శశికుమార్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమెతో పాటు ఆమె తల్లి రీమా దేవి, సోదరి శ్రుతిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొల్లాంలోని తమ ఇంటిలో రూ. 57 లక్షల దొంగ నోట్లను ముద్రించిన కేసులో... కొచ్చిలో వీరిని అరెస్ట్ చేసినట్టు ఇడుక్కి జిల్లా పోలీసు అధికారి వేణుగోపాల్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొల్లాంలో నివాసం ఉంటున్న నటి సూర్య శశికుమార్ పైఅంతస్తులో దొంగనోట్ల ముద్రణ జరుగుతోందని చెప్పారు.
ఈ నోట్లను ముద్రించేందుకు రూ. 4.36 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. ముద్రించిన నోట్లు చెలామణి చేస్తే సగం వాటా ఇస్తామనేది వీరి ఒప్పందం. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని..త్వరలో వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.
అయితే ఇడుక్కిలో మూడు రోజుల క్రితం రూ. 2.25 లక్షల నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి, విచారించగా... సూర్య శశికుమార్, ఆమె తల్లి, సోదరిల పేర్లు వెలుగులోకి వచ్చాయి.