ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఒక్క వెలుగు వెలిగిపోయిన వారు..ఈ మద్య విలన్ గా కూడా తమ సత్తా చాటుతున్నారు. సాధరణంగా హీరోగా రాణించిన వారు విలన్ వేషాలు వేయడానికి ఆలోచిస్తుంటారు. కానీ బాలీవుడ్ లో మాత్రం హీరోలుగా నటించిన వారు విలన్లు గా కూడా నటిస్తుంటారు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా నటించిన మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్ లాంటి వారు తెలుగు లో విలన్ గా నటించారు. ఇటీవల స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఈ సినిమాలో పక్షి రాజుగా అక్షయ్ కుమార్ మంచి నటన కనబర్చారు. మొదట పాజిటీవ్ గా..తర్వాత భీకరమైన విలనీజం చూపించాడు. అయితే అక్షయ్ మరోసారి విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి, లంచగొండితనం మీద పోరాడే ఓ స్వాతంత్య్ర సమరయోధుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు) సినిమా కి సీక్వెల్గా ఇండియన్ 2 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ నటిస్తుంది. కా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాష్కరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల సినిమాకి సంబంధించి ఓల్డర్, వైసర్, డెడ్లియర్ అనే క్యాఫ్షన్తో ఫొటోలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.