ఎంతో ఆసక్తి, వివాదాలతో సాగుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో మరో సంచలనం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ కారణంగా అనూహ్య రీతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సంచలనం రేకెత్తిస్తోంది. అయితే, ఈ సినిమా వల్ల తాజాగా మూడు సినిమా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా కడప జిల్లాలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని ప్రదర్శించిన మూడు సినిమా థియేటర్లను రెవిన్యూ అధికారులు సీజ్ చేయడం కలకలం సృష్టిస్తోంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ నెల 1న కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్, రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ థియేటర్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులను లెక్కచేయకుండా మార్నింగ్ షో వేసిన విషయం తెలిసిన స్థానిక అధికారులు థియేటర్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హెచ్చరించి వదిలిపెట్టారు. అయితే, ఈ విషయం వైరల్ అయింది.
మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రదర్శనను నిలిపివేయడంలో విఫలమైన కడప జిల్లా జాయింట్ కలెక్టర్పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది శుక్రవారం మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు థియేటర్లపై చర్యలకు ఉపక్రమించారు. ఆఘమేఘాల మీద జిల్లాలోని మూడు థియేటర్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో కడప, పోరుమామిళ్ల, రైల్వేకోడూరు మండలాల తహసీల్దార్లు ఈ సాయంత్రం మూడు సినిమా థియేటర్లను సీజ్ చేశారు.