యువరత్న నందమూరి బాలకృష్ణ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ తరపున మరొక్కసారి ఎమ్యెల్యే గా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఆయన హీరోగా రెండు సినిమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే వాటిలో ముందుగా ఇటీవల బాలకృష్ణ తో జైసింహా వంటి విజయవంతమైన సినిమాని తీసిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మించబోయే సినిమా ప్రారంభం కాబోతోంది. 

ఇక ఈ నెల 10న బాలయ్య జన్మదినం సందర్భంగా సినిమాని ఆరోజు ప్రారంభిద్దాం అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వలన 12వ తేదీన సినిమాని అధికారికంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభించనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక గత సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో బాలయ్య ఈ సినిమాను ఎంతో కసితో చేయనున్నట్లు సమాచారం. వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నారని, అలానే ఈ సినిమాకి రూలర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని గత కొద్దిరోజులుగా పలు మీడియా వర్గాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. 

ఇక ఈ సినిమాని రవికుమార్ ఎంతో జాగ్రత్తగా తీయనున్నారని, అందుకే ఆయన ఈ సినిమా కథను కూడా ఎంతో పక్కా ఎంటర్టైనర్ గా రెడీ చేయడం జరిగిందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం పుట్టినరోజు వేళ ఇది బాలయ్య తన అభిమానులకు ఇచ్చే ఒక గొప్ప కానుక అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: