సూపర్ స్టార్ కృష్ణ తో ఒకప్పుడు సినిమా చేయాలంటే నిర్మాతలు క్యూ కట్టేవారన్న సంగతి తెలిసిందే. అందుకు ముఖ్య కారణం కృష్ణ పాటించే నిజాయితీ గల పద్దతే. ఎందుకంటే కృష్ణ హీరోగా చేసిన సినిమా గనక ఫ్లాప్ అయితే నిర్మాత మళ్ళీ కోలుకోవాలనే ఉద్ధేశ్యంతో కృష్ణ వెంటనే అదే నిర్మాతకి డేట్స్ ఇచ్చేవారు. అంతేకాదు ఆ సినిమా ఆడితేనే తన రెమ్యునిరేషన్ తీసుకునేవారు. లేదంటే లేదు. ఈ గొప్ప మనసుండటం వల్లే సూపర్ స్టార్ 300 లకు పైగా సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు జనరేషన్ మారింది. స్టార్ హీరోలు కొంతమంది లాభాల్లో వాటా తీసుకునే ట్రెండ్ నడుస్తోంది.
కానీ వచ్చిన అతి పెద్ద సమస్య కూడా ఇక్కడే. సినిమా నిర్మాణం 100 కోట్లు అవుతుంటే కొన్ని సినిమాలకు వాటిలో సగం కూడా తిరిగి రావడంలేదు. ఇక మహేష్ విషయానికొస్తే సరిలేరు నీకెవ్వరు సినిమా కి దాదాపు 50 కోట్లు తీసుకుంటునట్లు సమాచారం. మహర్షి చిత్రానికి వందకోట్ల షేర్ వచ్చినప్పటికి నిర్మాతలకి మిగిలిందేమీ లేదు. మహేష్ పారితోషికంతో పాటు బడ్జెట్ ఎక్కువవడంతో పెట్టుబడి తిరిగి వస్తే చాలు అనకునే పరిస్థితి వచ్చింది. అయితే రిలీజ్ ప్లానింగ్, బిజినెస్ వ్యవహారాలని బాగా డీల్ చేసిన దిల్ రాజుని 'సరిలేరు నీకెవ్వరు'కి కూడా నిర్మాతగా వుండమని మహేష్ సూచించాడట.
మహేష్ మాట మీద ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్న దిల్ రాజు దీనికి మహేష్ డిమాండ్ చేసిన పారితోషికం పట్ల హ్యాపీగా లేడని గాసిప్స్ వున్నాయి. ఈ చిత్రానికి మహేష్ వాటాగా యాభై కోట్లు పైగానే వెళుతుందనేది ఇండస్ట్రీ టాక్. హీరోనే అంత తీసుకుపోతే ఇక సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది? చివరకు నిర్మాతకి ఏమి మిగులుతుందన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట? బాలీవుడ్ హీరోల మాదిరిగా మన స్టార్ హీరోలు లాభాల్లో వాటా మాత్రమే తీసుకోవాలని, అందువల్ల నిర్మాతపై భారం తగ్గడమే కాకుండా మరింత మంది నిర్మాతలు ఫీల్డులో వుంటారని, ఎక్కువ సినిమాలు రూపొందుతాయని చెప్పాడట. మరి ఈ పద్దతి మన స్టార్ హీరోలు పాటిస్తారో లేదో చూడాలి.